The Project Gutenberg eBook of ఓనమాలు
    
This ebook is for the use of anyone anywhere in the United States and
most other parts of the world at no cost and with almost no restrictions
whatsoever. You may copy it, give it away or re-use it under the terms
of the Project Gutenberg License included with this ebook or online
at www.gutenberg.org. If you are not located in the United States,
you will have to check the laws of the country where you are located
before using this eBook.

Title: ఓనమాలు

Author: Mahidhara Ramamohan Rao

Release date: January 14, 2013 [eBook #41845]

Language: Telugu

Credits: Produced by volunteers at Pustakam.net


*** START OF THE PROJECT GUTENBERG EBOOK ఓనమాలు ***




Produced by volunteers at Pustakam.net




అవంతీ ప్రచురణలు 4.




ఓనమాలు




రచన:

మహీధర రామమోహనరావు




సోల్ డిస్ట్రిబ్యూటర్లు:

విశాలాంధ్ర ప్రచురణాలయం,

విజయవాడ-2




మొదటి ముద్రణ

1956




వెల

రెండు రూపాయల పావలా




అవంతీ ప్రెస్

రాజమండ్రి




1947....

....నాటి తెలంగాణా ఒక అగ్నిగుండం.

దుస్సహమైన జాగీర్దారీ వ్యవస్థను నిర్మూలించగల పోరాటాల్ని ప్రజానీకం సాగిస్తూంది. వాటినన్నింటినీ ఒకే జెండా క్రిందికి తెచ్చి,
రాజకీయ నాయకత్వం సమకూర్చడానికై ఆంధ్రమహాసభా, కమ్యూనిస్టు పార్టీ సన్నాహాలు సాగిస్తున్నాయి.

రెండో వైపున – విదేశీ పాలనకూ, సంస్థానాధీశుల నిరంకుశ పాలనకూ వ్యతిరేకంగా జాతీయ ప్రజాతంత్ర పోరాటాలు తెలంగాణాన్ని
అలుముకొంటున్నాయి.

ప్రజాతంత్ర హక్కులకై సాగుతున్న ఈ పోరాటాలు ఐక్యతను కూర్చుకొంటూ నిజాము పరిపాలనా యంత్రాన్ని మొదలంట కదిల్చివేస్తున్నాయి.

ఈ దశలో …

విచ్ఛిన్నమైపోతున్న జాగీర్దారీ వ్యవస్థను రక్షించగల శక్తి నిజాము ప్రభుత్వానికి లేదని గ్రహించిన భూస్వామ్యవర్గం నూతన
నాయకత్వం కొరకై వెతుకులాడుతూ జాతీయోద్యమంలో తనకు రక్షణనివ్వగల శక్తుల్ని చూసుకొంది.

సమాజంలో తనకున్న బలం క్రమంగా క్షీణించి పోతూంటే, కూలిపోతున్న తన అధికారాన్ని పరిరక్షించుకొనేటందుకై మతవాదుల్నీ, రౌడీల్ని
సమీకరించి విధ్వంసకాండకు పూనుకొంది నిజాము సర్కారు.

ప్రజానీకానికీ, ప్రతిరోధ శక్తులకూ మధ్య జరిగిన ఈ ఘర్షణలలో తెలంగాణా ఒక అగ్నిగుండమే అయింది.

ఆనాటి సంఘర్షణలే నా ఈ నవలకు కథావస్తువు. సుదీర్ఘమైన ఈ నవలలో మొదటి భాగం పాఠకుల ముందుంచుతున్నా. త్వరలోనే
మిగతావీ.

విజయవాడ,

20-3-56

రచయిత.




భూమి కోసం
భుక్తి కోసం
నిగళబంధ
విముక్తి కోసం
నేల కొరిగిన
తెలుగు జోదుల
కిత్తు నంజలులు.

కృతజ్ఞత

తమ పత్రికలో ధారావాహికగా వెలువడిన ఈ నవలను పుస్తకరూపంలో ప్రచురించుకొనుటకనుమతించిన విశాలాంధ్ర సంపాదకులకు -

రచయిత.




ఓనమాలు
(మొదటి భాగం)




ఒకటో ప్రకరణం.


అటువంటివాడు ఒక వారం పది రోజులనుంచి పరధ్యానంగా వుంటున్నాడు. ఆతడు దూరదూరంగా వుంటున్నాడనిపించింది. ఆ ఆలోచనతో మనస్సు
కరిగిపోతూంది; హృదయం ఆరాటపడిపోతూంది; అతనిని కదిలించడానికి చేసిన ప్రయత్నాలన్నీ, విఫలం అయ్యాయనిపిస్తూంటే ఎంతో
బాధపడిపోతూంది. ఈ వారం పది రోజులుగా అతనిలో కనిపిస్తున్న ధోరణి ఏమిటో అర్థం కాలేదు. ఏమేమిటో కారణాలు కల్పించుకొంటూంది.
ఆ కారణాలన్నీ ఆమెను మరింత బాధిస్తున్నాయి.

అతడు తన ఎరికలో ఇంత గాఢంగా ఆలోచనల్లో మునిగి వుండడం ఎప్పుడూ జరగలేదు. అతడు ఆలోచించవలసిన విషయాలు మాత్రం
పెద్దగా ఏం వున్నాయిగనక. ఆస్తా...సెంటు భూమి లేదు. పన్నుకి పీడించేవాళ్ళింక పుట్టవలిసిందేనని అతడే వేళాకోళంగా
అంటూంటాడు....తల్లా, తండ్రా?...ఆ ఇద్దరూ కూడా ఏనాడో మరణించారు.

...పెళ్ళామా, పిల్లలా?....ఈ మాట ఆలోచనకు వచ్చినప్పుడు సత్తెమ్మ అంత సులభంగా 'కాదు' అనుకోలేకపోయింది.
ఆలోచించగా, ఆలోచించగా అసలు కారణం అక్కడే వున్నట్లు కూడా అనిపించింది. అనిపించడంతో కళ్ళనీళ్లు తిరిగేయి.

అతనిని కాదనడానికి తనకున్న హక్కు ఏమిటి? అతని కోసం తాను ఎంతయినా త్యాగం చేసి వుండొచ్చు. ఉండొచ్చునేమిటి? చేసింది.

ఊరువాళ్ళ మాటల్ని ఖాతరు చెయ్యలేదు. తల్లి ఏడ్పును లెక్కచెయ్యలేదు. కుల మర్యాదల నాలోచించలేదు. అతని కోసం
ఆత్మార్పణ చేసుకొంది. సమాజంలో ఆడది చేయగల త్యాగానికది పరాకాష్ఠ. అయితేనేం?...

అతడు తనకి మగడు కాదు. తనకి మగడు లేడు. వెంకటయ్య కోసం తాను ఎంత తపన పడ్డా, తానో వితంతువు మాత్రమే. అతని
మీద తనకు హక్కు లేదు.

తనతో సావాసం చేసేక అతడు ఇతర పడుచుల్ని అంటుకోలేదు. కన్నెత్తి కూడా చూడలేదు. వెంకటయ్య కోసం దార్లుకాచిన పడుచుల్నీ,
అతని మాటకోసం కాట్లాడుకొన్న పడుచుల్నీ ఆమె ఎరుగును. అన్నీ ఎరిగే ఆమె అతనితో నేస్తం చేసింది. తనతో చేరేక అతడు
పూర్తిగా మారిపోయేడు. అతని పరిచయాల విషయంలో తాను పడ్డ జాలికూడా అతనికి నవ్వుతాలయింది. ఆ సంగతినామె ఎరుగును. అతడు
తనదే లోకంగా ఆనందిస్తున్నాడు. తనకేమాత్రం కష్టం కలిగినా గిజగిజలాడి పోతాడు. తన కాళ్ళక్రింద కళ్ళు పరిచేడు.
కళ్ళముందు హృదయం విప్పేడు.

